తెలంగాణకు టీఆర్‌ఎస్‌ శ్రీరామరక్ష : తలసాని

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు గగ్గోలు పెట్టినా.. ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. దేశ చరిత్రలో ఇంతటి ఘనవిజయం ఏ పార్టీకి రాలేదని, ఇతంటి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు తమ పార్టీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. చైర్మన్‌, మేయర్‌ల ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిందన్నారు. ప్రతిపక్షాలు జీవితంలో ఏ ఒక్క వర్గానికి అవకాశం ఇవ్వకపోగా, అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. పార్టీలను, ప్రభుత్వం తిట్టడం వల్ల ఓట్లు పడవని, అభివృద్ధి పనులు చేస్తేనే అధికారంలోకి వస్తారని హితవు పలికారు. ప్రతి పక్షాలు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని నీచరాజకీయాలు చేయడం ఆపేయాలని సూచించారు. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రీరామరక్ష అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.